: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులను సిద్ధం చేసింది. వాయుగుండం తీరం వెంబడి పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

More Telugu News