: మ‌మ్మీ.. డాడీ.. కేడీ అన‌కూడదు: అమరావతిలో వెంక‌య్యనాయుడు

ఇంగ్లిష్ నేర్చుకోవాలి కానీ, ఇంగ్లిష్ వారి బుద్ధులు తెచ్చుకోకూడదని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తి ప్రాంతంలోని ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క‌లిసి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ.. ‘పిల్ల‌ల‌కు తెలుగు నేర్పించండి.. తెలుగు మ‌ర్చిపోతే అమ్మ‌ను కూడా మ‌ర్చిపోతారు. హిందీ, ఇంగ్లిష్ తో పాటు అన్ని భాష‌లు నేర్చుకోవాలి. మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ అని అన‌కూడ‌దు.. చ‌క్క‌గా తెలుగులో అమ్మ‌, నాన్న అనండి. అమ్మ అంటే క‌డుపులోంచి ప‌దం వ‌స్తుంది. మ‌మ్మీ అంటే గొంతులోనుంచి మాత్ర‌మే వ‌స్తుంది’ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా తాను గ‌ర్విస్తున్నాన‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్ర‌పంచంలోని ఎన్నో సంస్థ‌ల‌కు అధిప‌తులుగా భారతీయులే ఉన్నార‌ని, అందులోనూ తెలుగు వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని ఆయ‌న‌ చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. దేశం ముందుకెళ్లాలంటే విద్య‌, వైద్యం, ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారం కావాల‌ని అన్నారు. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని ప్రశంసించారు.

More Telugu News