: ఎల్‌వోసీ వెంబడి పాక్‌ వైపు నాలుగు ఉగ్రస్థావరాలు.. భారత్‌లో దాడుల కోసం ఉగ్రవాదులకు శిక్షణ.. గుర్తించిన భారత ఆర్మీ ఇంటెలిజెన్స్

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ వైపు నాలుగు ఉగ్రస్థావరాలు ఉన్నట్టు భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సాంబా సెక్టార్‌కు దగ్గరల్లోనే ఇవి ఉన్నట్టు కనుగొన్నారు. మంగళవారం సాంబా సెక్టార్‌లోని భారత పోస్టులపై కాల్పులకు పాల్పడిన పాక్ ఆరుగురు పౌరులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. సరిహద్దుకు ఆవల పాకిస్థాన్ వైపు 5 కిలోమీటర్ల లోపలే జేషే మహ్మద్ ఉగ్రస్థావరాలు ఉన్నాయి. భారీగా ఆయుధాలు చేతబట్టిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌ వైపు నుర్-ఉల్-ఇస్లాం పోస్టు వద్ద మిలటరీ దుస్తుల్లో సిద్ధంగా ఉన్నారు. ఎల్‌వోసీ వెంబడి ఉన్న లాంచ్ ప్యాడ్‌లను భారత్‌లో దాడుల కోసం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఇంటెలిజెన్స్ గుర్తించిన నాలుగు ఉగ్రస్థావరాల్లో ఒకటి భారత్‌లోని హరినగర్ సెక్టార్‌లోని కతువా పహార్‌పూర్‌లోని బీఎస్ఎఫ్ బోర్డర్ పోస్టుకు ఎదురుగా ఉండడం గమనార్హం. రెండేళ్ల క్రితం లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన ఈ స్థావరాలను తిరిగి ఉపయోగిస్తున్నట్టు నివేదిక తెలిపింది.

More Telugu News