: టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదు: కర్ణాటక హైకోర్టు

తమకు తెలిసినంత వరకు టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, చరిత్రను బట్టి చూస్తే అతడు ఓ రాజ్యానికి రాజు మాత్రమేనని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జయంతిని ఘనంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో దాఖలైన పిల్‌ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసును గురువారానికి వాయిదా వేసిన కోర్టు అంతకుముందు కీలక వ్యాఖ్యలు చేసింది. టిప్పు సుల్తాన్ జయంతిని ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారని చీఫ్ జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపు లాయర్ ఎంఆర్ నాయక్ తన వాదనలు వినిపిస్తూ టిప్పు సుల్తాన్ గొప్ప యోధుడని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడని, స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్లే ఆయన జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి చీఫ్ జస్టిస్ ముఖర్జీ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు టిప్పు సుల్తాన్ స్వాంతంత్ర్య సమరయోధుడు కాదని పేర్కొన్నారు. చరిత్రను బట్టి చూస్తే ఆయనో రాజు మాత్రమేనని, స్వాతంత్ర్య సమరయోధుడు కాదని తెలిపారు. అటువంటప్పుడు ఆయన జయంతిని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం నిర్వహించకుండా ఆదేశించాలని కోర్టును కోరారు.

More Telugu News