: సరిహద్దు ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన 25 వేల మంది ప్రజలు
భారత సైన్యం పాక్ పై లక్షిత దాడులు నిర్వహించినప్పటినుంచి భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్లో పౌరులపై పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. నెలరోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో దాదాపు 25 వేల మంది సరిహద్దు గ్రామాల ప్రజలు సొంత ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. పాకిస్థాన్ రేంజర్ల కాల్పులతో నెలరోజుల్లో ఇప్పటి వరకు సుమారు పది మంది జవాన్లు, 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు 167 గ్రామాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలను వీడారు. తమ సొంత ఊళ్లలో ఉన్న పశువులు, పంటల పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్పుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు దాదాపు 300 పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.