: పోలీసు అధికారులపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)పై కేంద్ర వైఖరికి నిరసన తెలుపుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ పోలీసు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయనను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ల‌కూడ‌ద‌ని పోలీసులు అన‌డంతో ఆయ‌న కోపంతో ఊగిపోయారు. స్టేష‌న్ లో ఉన్న‌ పోలీస్ అధికారిని నీ పేరేంటని ప్ర‌శ్నిస్తూ, ప‌రామర్శ‌కు వెళుతోన్న‌ త‌న‌ను అదుపులోకి తీసుకున్నారని, పోలీసుల‌కి సిగ్గులేదా? అని అన్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ రామ్ కిషన్ తండ్రిని, కుమారుడిని కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకువాడంపై కూడా ఆయ‌న మండిప‌డ్డారు. పోలీసుల చ‌ర్య‌ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ఆసుప‌త్రి వ‌ద్ద ప‌రిస్థితులు చ‌క్క‌దిద్ద‌డానికే తాము పై అధికారుల ఆదేశాలు పాటిస్తున్నామని పోలీసులు చెబుతుండ‌గానే రాహుల్ పోలీస్ అధికారులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News