: రైల్వే బీమాకు భారీ స్పందన.. రెండు నెలల్లో రెండు కోట్ల మంది వినియోగం

రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన బీమా పథకానికి అనూహ్య స్పందన లభించింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే ఏకంగా రెండు కోట్ల మంది ఈ బీమాను వినియోగించుకోవడం విశేషం. కేవలం 92 పైసలు చెల్లించడం ద్వారా రూ.10 లక్షల బీమా పొందే ఈ పథకాన్ని రెండు నెలల క్రితం రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు టికెట్‌కు అదనంగా 92 పైసలు చెల్లించిన వారికి ఈ బీమా సదుపాయాన్ని రైల్వే కల్పిస్తోంది. సెప్టెంబరులో ఈ పథకం ప్రారంభమవగా గతనెల 31 నాటికి 2.7 కోట్ల మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రోజూ ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటున్న 5.5 లక్షల మందిలో 3.5 లక్షల మంది బీమా చేయించుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బీమా పథకం వర్తిస్తుంది. బీమా చేయించుకున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో ప్రమాదం బారిన పడి మృతి చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తారు. అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులైతే రూ.2 లక్షలు, మెడికల్ బిల్లలు చెల్లిస్తారు. అంతేకాక రైలుపై ఉగ్రదాడి, దొంగతనం, కాల్పులు, దారి మళ్లింపు వంటి ఘటనలు చోటుచేసుకున్నా బీమా వర్తిస్తుంది.

More Telugu News