: హెడ్ కానిస్టేబుల్ పాడెను మోసిన ముఖ్యమంత్రి

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే క్రమంలో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ ను సిమీ ఉగ్రవాదులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయన భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. రమాశంకర్ కు నివాళి అర్పించి, అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతేకాదు, రమాశంకర్ పాడెను మోసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అతని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని... అతని కుమార్తె వివాహానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. దీనికి తోడు, రమాశంకర్ నివసిస్తున్న కాలనీకి అతని పేరు పెడతామని చెప్పారు. సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని... ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అన్నారు.

More Telugu News