: కనిపించింది 60 సెకన్లే అయినా కేరింతలు కొట్టిన చైనీయులు... జే-20ని తొలిసారి చూపిన చైనా

చైనా దక్షిణప్రాంతంలోని జుహాయ్ విమానాశ్రయం... ఈ సంవత్సరపు చైనా అతిపెద్ద ఎయిర్ షో మంగళవారం నాడు ప్రారంభం కాగా, అందరికళ్ళూ ఆకాశం వైపే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20 స్టెల్త్ ఫైటర్ విమానాలను తొలిసారిగా ఈ ఎయిర్ షోలో ప్రదర్శించాలని నిర్ణయించగా, వీటిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు ఆసక్తి చూపారు. ఇక ఎయిర్ షో ప్రారంభమైన తరువాత రెండు జే-20 జెట్ విమానాలు భీకర శబ్దం చేస్తూ దూసుకెళ్లగా, ప్రజలు కేరింతలు కొట్టారు. కేవలం 60 సెకన్ల పాటు మాత్రమే వీటిని ప్రదర్శించడం గమనార్హం. వచ్చే పదేళ్లలో ఏవియేషన్ మార్కెట్ ను, వాయుసేనను అధిగమించాలన్నదే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జే-20 విమానాలతో చైనా యుద్ధ సామర్థ్యం కచ్చితంగా మరో మెట్టు ఎక్కినట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ విమానాలు లాక్ హీడ్ మార్టీన్ ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 తదితర విమానాలతో పోటీ పడగలవని తెలుస్తోంది.

More Telugu News