: ఏపీలో 450 ఉద్యోగాల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. నాలుగు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా 450 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో 160 హోంగార్డు పోస్టులు, ముఖ్యమంత్రి సెక్యూరిటీ గ్రూప్‌లో అదనంగా 290 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లలో ఎ నుంచి హెచ్ వరకు ఉన్న సెక్షన్లలో పనిచేసేందుకు 46 తహశీల్దార్ల పోస్టుల పదోన్నతికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే పదేళ్లలో రూ.3,028.75 కోట్లను ఈ యూనివర్సిటీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటిలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్, ఆర్ఎస్ ట్రస్ట్(వెల్‌టెక్), వరల్డ్ పీస్ యూనివర్సిటీ, మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఉన్నాయి.

More Telugu News