: అప్పుల్లోను, ఎన్నికల హామీలను అమలు చేయ‌క‌పోవ‌డంలోను తెలంగాణ‌ నెంబర్ వన్!: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ ప‌టేల్ ల జయంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని గాంధీభ‌వ‌న్‌లో వారి చిత్ర‌ప‌టాల వ‌ద్ద ఈ రోజు టీపీసీసీ నేత‌లు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... దేశానికి ఆ నేత‌లు ఎన‌లేని సేవ చేశార‌ని పేర్కొన్నారు. దేశానికి బ్రిటీష్ పాల‌న నుంచి స్వాతంత్ర్యం వచ్చిన ఫ‌లితాన్ని దేశ ప్రజలంద‌రూ అనుభ‌వించాల‌న్న ల‌క్ష్యంతో ఇందిరాగాంధీ పాలన కొన‌సాగింద‌ని ఆయ‌న చెప్పారు. దేశంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేయడంలో సర్దార్‌ వల్లభాయ్ ప‌టేల్ ప్ర‌ధానంగా కృషి చేశార‌ని అన్నారు. తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల‌న బాగుందంటూ ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేలు అన్నీ బోగస్ సర్వేలేన‌ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ స‌ర్వేల‌తో రాజకీయాలు చేస్తున్నారని, ఆ సర్వే అంతా అబ‌ద్ధాల పుట్టేన‌ని చెప్పారు. సర్వే నిజమైన‌దే అయితే ఇత‌ర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయించడం లేదని అడిగారు. రాష్ట్రం అప్పుల్లోను, అన్న‌దాత‌ల‌ ఆత్మహత్యల్లోను, ఎన్నికల హామీలను అమలు చేయ‌క‌పోవ‌డంలోను తెలంగాణ‌ మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు. మ‌రోవైపు జీహెచ్‌ఎంసీలోనూ వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని అన్నారు.

More Telugu News