: బ్యాడ్మింటన్ కోచ్ లు, అకాడమీలు చైనాలో అధికం.. భారత్‌లో తగినన్ని లేకపోవడం దురదృష్టకరం: సైనా

భారత్‌లో బ్యాడ్మింటన్ కోచ్ ల సంఖ్య తక్కువగా ఉండడం, అకాడమీలు త‌గిన‌న్ని లేకపోవడంపై షట్లర్ సైనా నెహ్వాల్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చైనాలో ఉన్న ఈ సదుపాయాల్ని భార‌త్‌తో పోల్చుతూ విచారం వ్య‌క్తం చేసింది. చైనాలో ముప్ఫై వేల నుంచి నలభై వేల వరకూ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నార‌ని చెప్పింది. ఆ దేశంలో ఒక్కో ఈవెంట్ జరుగుతున్న స‌మ‌యంలో నలుగురు లేదా ఐదుగురు కోచ్లు ఉంటారని తెలిపింది. ఈ అనుకూల‌ ప‌రిస్థితులే వారిని ఛాంపియన్లుగా చేస్తున్నాయ‌ని పేర్కొంది. చైనాతో పోల్చి చూసుకుంటే భార‌త్‌లో ప్రధాన నగరాల్లో 20 నుంచి 30 మంది కోచ్లు ఉండాల‌ని, కానీ, ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కోచ్‌లు ఉంటున్నార‌ని పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశంగా ఆమె పేర్కొంది. భార‌త్‌లో బ్యాడ్మింటన్ అకాడమీలు కూడా త‌గిన‌న్ని లేవ‌ని సైనా నెహ్వాల్ చెప్పింది. సాధ్యమైనంత ఎక్కువ మంది కోచ్లు కూడా లేకపోవడం పట్ల సైనా ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఆట‌ల్లో వెనకబడిపోయామని చెప్పింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్లో చైనా క్రీడాకారులు మంచి ఫలితాలు అందుకోలేక‌పోతోన్నప్పటికీ చైనాను తక్కువ అంచనా వేయలేమ‌ని పేర్కొంది. కోచ్‌లు, బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలు అధికంగా ఉన్న చైనా నుంచి ఏ క్షణానైనా ఛాంపియన్లు తయారవుతారని తెలిపింది. భార‌త్‌లో మౌలిక వసతులు బాగానే ఉన్నా కోచ్‌లు, బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని తెలిపింది.

More Telugu News