: పాకిస్థాన్ కు ఝలక్కిచ్చిన ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్... రూ. 1,400 కోట్ల రుణం హుళక్కే!

తాము ఆక్రమించి అధీనంలో ఉంచుకున్న భారత భూభాగంలోని సింధూ నదిపై నిర్మించాలనుకున్న భారీ రిజర్వాయర్ నిమిత్తం పాకిస్థాన్ కు రుణం ఇవ్వలేమని చెబుతూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఝలక్కిచ్చింది. రెండేళ్ల క్రితం రూ. 1,400 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని భావించిన పాక్, నిధుల కోసం ఏడీబీని సంప్రదించగా, రుణం ఇవ్వడానికి సమ్మతిస్తూనే, ఇండియా నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకురావాలని సూచించింది. తమ ప్రాజెక్టు కోసం అందునా పీఓకేలో రిజర్వాయర్ కోసం ఇండియాను 'నో అబ్జక్షన్' పత్రాన్ని అడిగేందుకు నిరాకరించిన పాక్, తాజాగా మరోసారి ఏడీబీని సంప్రదించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఏడీబీ అధ్యక్షుడు టకిహికో నకావో, సింధు నది ప్రాజెక్టుపై స్పందిస్తూ, ఇది భారీ ప్రాజెక్టని, దీనికి నిధులపై తాము ఎలాంటి హామీనీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తో సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్, బాల్తిస్థాన్ ప్రాంతాలకు సాగు, తాగు నీటితో పాటు కరెంటు అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టుకు మరిన్ని భాగస్వామ్యాలు అవసరమని, ఏడీబీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News