: పన్ను చెల్లింపుల్లో ట్రంప్ కంపు... 'యూఎస్ఏ టుడే'లో సంచలనాత్మక కథనం

రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ కు చెందిన 100కు పైగా కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతున్నాయని, పలు వివాదాల్లో చిక్కుకున్నాయని, పన్నులు ఎగవేసినందుకు జరిమానాలు కూడా చెల్లించాయని చెబుతూ, 'యూఎస్‌ఏ టుడే' పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. పత్రిక పేర్కొన్న వివరాల మేరకు ట్రంప్ కంపెనీలపై వందకుపైగా కేసులు నమోదుకాగా, డజన్లకొద్దీ వారెంట్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వివిధ కోర్టుల్లో తీర్పుల మేరకు దాదాపు మూడు లక్షల డాలర్ల మేరకు బకాయిలను చెల్లించగా, అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇక పన్ను చెల్లింపుల్లో ట్రంప్ కంపెనీలు పారదర్శకతను అసలు పాటించ లేదని, ఆస్తులను, ఆదాయాన్నీ తక్కువ చేసి చూపించడం ఆ కంపెనీలకు అలవాటని 'యూఎస్‌ఏ టుడే' పేర్కొంది. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తిని వందకోట్ల డాలర్లుగా చూపించి అధికారులను తప్పుదారి పట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అమెరికా కార్పొరేట్ వర్గాల్లో కలకలం సృష్టించే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లించాలంటూ జారీ అయ్యే ప్రభుత్వ ఆదేశాలను ట్రంప్ కంపెనీలు ఖాతరు చేయవని, చర్యలకు ఉపక్రమించినప్పుడు కోర్టులకు వెళ్లి తాత్కాలిక ఉపశమనాన్ని పొంది, ఓడిపోయిన తరువాత మాత్రమే బకాయిలు చెల్లిస్తాయని పత్రిక పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన ఆస్తుల జాబితా అఫిడవిట్ లో ట్రంప్‌ తన ఆస్తిని తక్కువ చేసి చూపారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రచారం కోసం నిత్యమూ ఆయన తిరుగుతున్న సొంత జెట్‌ విమానానికి సుమారు పదివేల డాలర్ల పన్ను బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వుందని వెల్లడించింది. న్యూయార్క్‌ తో పాటు నెవడా, ఫ్లోరిడా, న్యూజెర్సీల్లోని వివిధ కోర్టుల్లో ట్రంప్‌ కంపెనీలపై పన్ను ఎగవేత కేసులు నడుస్తున్నాయని, గడచిన 27 సంవత్సరాల కాలంలో వివిధ కేసుల్లో వచ్చిన తీర్పుల మేరకు ఇంకా 3 లక్షల డాలర్లను చెల్లించాల్సి వుందని తెలియజేసింది. 1990 - 2011 మధ్య కాలంలో ట్రంప్‌ కంపెనీలపై న్యూయార్క్‌ సిటీ ట్యాక్స్‌ కమిషన్‌ 55 కేసులు వేసిందని, 2006 - 2007 మధ్య ట్రంప్‌ మార్ట్‌ గేజ్‌ కంపెనీ 4,800 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉందన్న దస్త్రాలను తాము సంపాదించామని 'యూఎస్‌ఏ టుడే' పేర్కొంది.

More Telugu News