: చంద్రబాబు ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేస్తోంది: వైసీపీ ఫైర్

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైపీసీ నేతలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, పత్రికల యజమానులు, పోలీసు అధికారుల ఫోన్లను చంద్రబాబు సర్కార్ ట్యాప్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్లను కూడా చంద్రబాబు ట్యాప్ చేయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని లోబరుచుకునేందుకు ఈ విధంగా దిగజారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... ఇప్పుడు అదే అంశాన్ని ఆయుధంగా మలచుకున్నారని విమర్శించారు. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రిక యజమానుల ఫోన్లను ట్యాప్ చేసి... వారిని లోబరుచుకుంటున్నారని భూమన ఆరోపించారు. ఫోన్లను ట్యాప్ చేస్తూ, ఎదుటి వారి జీవితాల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ అనుమతితో కేవలం దేశద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారని గుర్తుచేశారు. అందరినీ కలుపుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ పై పోరాడతామని భూమన అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే, ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరారు.

More Telugu News