: ‘గాలి’ కూతురు పెళ్లి వేడుకల్లో ఆడిపాడనున్న షారూఖ్, ప్రభుదేవా, కత్రినా, తమన్నా?

కుమార్తె పెళ్లి కార్డుతో సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జానర్దన్‌రెడ్డి పెళ్లి వేడుకలో మరో సంచలనానికి తెరతీయనున్నట్టు సమాచారం. కుమార్తె పెళ్లి కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో గాలి బిజీగా ఉన్నారు. ఆయన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, కత్తినా కైఫ్, ప్రభుదేవా, తమన్నాలు ఆడిపాడనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. నవంబరు 16న జరగనున్న పెళ్లిని అదిరిపోయేలా చేసేందుకు గాలి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు వంటి వారిని కూడా ఆయన ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కన్నడ దర్శకుడు, హీరో ఉపేంద్రను ఇప్పటికే ఇంటికి వెళ్లి మరీ గాలి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కేవలం కుమార్తె వెడ్డింగ్ కార్డు కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేసిన గాలి పెళ్లి ఇంకెంత వైభవంగా చేస్తారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే నెల 16న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ దేవరరెడ్డి కుమారుడు రాజీవ్‌రెడ్డితో జనార్దనరెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం బెంగళూరులోని ఓ పెద్ద ప్యాలస్‌లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి దాదాపు రూ.550 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.

More Telugu News