: బీహార్ లో ఘోరం... సినిమాలను మించిన కిరాతకం.. బాలికను దారుణంగా చంపిన దుండగులు!

బీహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని చెప్పేందుకు సరైన ఉదాహరణ లాంటి కిరాతకం జరిగింది. కైమూర్ జిల్లాలోని ఫక్రాబాద్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్ష ఉండడంతో తొటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా, బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు... సినిమాల్లోలా ఆమె చున్నీ పట్టుకుని లాగారు. దీంతో బాలిక రోడ్డుపై పడిపోయింది. బైక్ పై నున్న దుండగులు ఆమె చున్నీ వదలకుండా అలాగే పట్టుకుని సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు. అనంతరం ఆ బైక్ ను ఆమె మీది నుంచి ఎక్కించారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో భయాందోళనలకు గురైన సహవిద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇంతలో బైక్ అదుపుతప్పి పడిపోయింది. దాంతో బైక్ ను వదిలేసిన ఆ ముగ్గురూ అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు బైక్ ను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన పోలీసులు వారిని శాంతింపజేసి, కేసులో ఆ బైక్ సాక్ష్యంగా ఉంటుందని నచ్చజెప్పారు. బైక్ బ్రిజేష్ గుప్తా పేరుతో రిజిస్టరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, బాలిక తండ్రి ఫిర్యాదుతో కిషోర్ కుమార్‌, అతడి స్నేహితులిద్దరిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News