: తమిళనాట అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పూజలే పూజలు!
తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీ కార్యకర్తలు పూజల్లో మునిగిపోయారు. రాజకీయ చైతన్యం మెండుగా వుండే తమిళనాడులో సినీ నటులకే కాక రాజకీయ నాయకులకు కూడా అశేషమైన అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో కొన్నాళ్ల క్రితం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. దీంతో అమ్మకు స్వస్థత చేకూరాలంటూ గత మూడు వారాలుగా ఆమె అభిమానులు పూజల్లో మునిగిపోయారు. ఎట్టకేలకు ఆమెను దీపావళి నాటికి డిశ్చార్జ్ చేస్తామన్న మాట వైద్యుల నోట వెలువడడంతో ఆమె అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంచితే, ఇదే సమయంలో మరోపక్క డీఎంకే అధినేత కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయనను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన కోలుకోవాలంటూ పూజలు మొదలెట్టారు. ఈ విధంగా ఈ దీపావళి తమిళనాట ప్రత్యేకపూజలతో గడవనుంది. జయలలిత కోలుకున్నందుకు, కరుణానిధి కోలుకునేందుకు పెద్ద ఎత్తున దీపావళి పూజలు జరిగే అవకాశం కనిపిస్తోంది.