: అఫ్గాన్లో దారుణం.. 30 మందిని అపహరించి హత్య చేసిన ఉగ్రవాదులు
ఆఫ్గానిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. సుమారు 30 మంది చిన్నారులతో సహా ఆ దేశ పౌరులను అపహరించి, హత్య చేశారు. ప్రొవిన్షియల్ క్యాపిటల్ ఫిరోజ్ కోహ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన అక్కడి ప్రభుత్వం, నిన్న స్థానిక ఇస్లామిక్ స్టేట్ కమాండర్ను అంతమొందించినందుకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. మృతుల్లో అధికమంది గొర్రెల కాపరులేనని చెప్పింది. నిన్న రాత్రే అక్కడి ప్రజలను ఉగ్రవాదులు అపహరించారు. ఈ రోజు గ్రామస్తులు వారి మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదులు తరుచూ రెచ్చిపోతున్నారు. ఇటీవలే కాబూల్లో దాడి చేసి దాదాపు 80 మంది ప్రాణాలు తీశారు.