: బ్రిటన్ యువరాణి 'టాప్ లెస్' ఫొటోల ఉదంతం... ఆరుగురు జర్నలిస్టులపై విచారణ

బ్రిటన్ యువరాణి, ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. సీక్రెట్ గా ఫొటోలు తీయడమే కాకుండా, వాటిని తమ మేగజీన్ కవర్ పేజ్ పై ప్రచురించి, బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ మిడిల్ టన్ లాయర్ల వాదనకు కోర్టు మొగ్గు చూపింది. దీంతో, ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు సర్వం సిద్ధమైంది. వచ్చే జనవరి నుంచి విచారణ జరుగుతుందని ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసు వివరాల్లోకి వెళితే, 2012లో ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్) కేట్ మిడిల్ టన్ లు హాలిడే కోసం దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ ప్రాంతానికి వెళ్లారు. మూడో మనిషి కూడా అడుగుపెట్టలేని ఆ భవంతి పోర్టికోలో వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. జూమ్ కెమెరాతో కేట్ మిడిల్ టన్ టాప్ లెస్ ఫొటోలను కెమెరాలో బంధించారు. ఆ తర్వాత ఆ ఫొటోలను కవర్ పేజ్ పై ముద్రించి మేగజీన్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గుమంది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి, సదరు మేగజీన్ పై దావా వేసింది. ఈ నేపథ్యంలో, నాలుగేళ్ల విచారణ అనంతరం, మేగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది.

More Telugu News