: ఎన్ కౌంటర్లో గాయపడ్డ మావోయిస్టు అగ్ర నేత ఆర్కే

ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 31కి పెరిగింది. పోలీస్ కాల్పుల్లో అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే గన్ మెన్లు ముగ్గురు మరణించారు. మరోవైపు, కాల్పులు జరుగుతున్న సమయంలో ఆర్కేను ఆయన మరో గన్ మెన్ ఉన్నపళంగా ఎత్తుకొని వెళ్లాడు. ఈ క్రమంలో, ఆర్కే గాయపడ్డట్టు సమాచారం. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆర్కే సెక్యూరిటీ సిబ్బంది తమపై కాల్పులు జరుపుతూ, ఆ ప్రాంతం నుంచి ఆయనను తీసుకెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆర్కే ఏవోబీలోని బెజింగి అటవీ ప్రాంతంలోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కోసం 800 మంది గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీ-ఒడిశా సంయుక్త దళాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఆర్కేను సజీవంగా పట్టుకోవడం లేదా మట్టుబెట్టడానికి ఇదే సరైన అవకాశం అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఆర్కే నుంచి మావోయిస్టు పార్టీకి కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఆయన కాంటాక్ట్ దొరకలేదని ధ్రువీకరిస్తున్నాయి.

More Telugu News