: హాట్ కేకుల్లా విశాఖ వన్డే టికెట్లు.. తొలిరోజే 10,500 అమ్మకం

భారత్-న్యూజిలాండ్ మధ్య విశాఖపట్టణంలో ఈనెల 29న జరగనున్న వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొత్తం 12 వేల టికెట్లకు తొలి రోజు 10,500 టికెట్లు క్షణాల్లో అమ్ముడయ్యాయి. నగరంలోని 20 ఈ-సేవ కేంద్రాల్లో మంగళవారం విక్రయానికి ఉంచిన ఈ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు క్యూకట్టారు. దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా అరగంటలోనే పదివేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడైపోయాయి. వెయ్యి రూపాయల టికెట్లు 5,900 విక్రయించినట్టు అధికారులు తెలిపారు. రూ.1500, రూ.2వేల టికెట్లు కొన్ని మిగిలాయి. ఇవి ఇంకా 1500 ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా విశాఖ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వన్డేకు తుపాను గండం పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కోస్తా దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నమే ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకోనున్నారు. వాతావరణం అనుకూలించకపోతే వారు నగరానికి చేరుకోవడం కూడా అనుమానమే.

More Telugu News