: బసవతారకం ఆస్పత్రి ఉన్నదే పేదల కోసం.. అందులో అడుగుపెడితేనే సగం జబ్బు మాయం: పింక్ రిబ్బన్ వాక్‌లో సినీ నటుడు బాలకృష్ణ

బసవతారకం ఆస్పత్రి ఉన్నదే పేదల కోసమని, అందులో అడుగుపెడితే సగం జబ్బు మాయమవుతుందని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద కొద్దిసేపటి క్రితం పింక్ రిబ్బన్ వాక్‌ నిర్వహించారు. దీనికి బాలకృష్ణ, మంచు లక్ష్మి, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్రెస్ట్ కేన్సర్ కొందరిలో వారసత్వంగానూ, కొందరిలో మధ్యలోను వస్తుందని అన్నారు. ఈ వ్యాధి ముదిరే వరకు చాలామంది గుర్తించలేకపోతున్నారని, అవగాహన కోసమే పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బ్రెస్ట్ కేన్సర్‌ చికిత్స చాలా ఖర్చు అవుతుందని గ్రామీణ ప్రాంతాల మహిళలు భావిస్తున్నారని, అయితే బసవతారకం కేనర్స్ ఆస్పత్రిలో అటువంటిదేమీ లేదని, అది కట్టిందే పేదల కోసమని స్పష్టం చేశారు. ఇందులో అడుగుపెడితేనే సగం వ్యాధి నయమవుతుందన్నారు. తన తల్లిగారు కేన్సర్‌తోనే మరణించారని, ఆమె గుర్తుగానే ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు తెలిపారు. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి ఎందరో మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బారినుంచి బయటపడి వెళ్లారని గుర్తు చేశారు. బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

More Telugu News