: విజేందర్ సింగ్ బాటలో అఖిల్, జితేందర్

ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన విజేందర్ సింగ్ బాటలో మరో ఇద్దరు బాక్సర్లు నడుస్తున్నారు. హర్యాణా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అఖిల్ కుమార్, జితేందర్ కుమార్ లు కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో సత్తాచాటి, బీజింగ్ ఒలింపిక్స్ లో క్వార్టర్స్ లో ఇంటి ముఖంపట్టారు. అయితే ఆ ఒలింపిక్స్ లో ప్రపంచ నెం.1 సెర్గెయ్‌ వోడోప్యానోవ్‌ ను ఓడించి, అఖిల్ సంచలనం సృష్టించినా, క్వార్టర్‌ ఫైనల్‌ లో మాత్రం ఓటమిపాలయ్యాడు. ఫ్లై వెయిట్‌ విభాగంలో తలపడిన జితేందర్‌ కుమార్ ఉజ్బెకిస్థాన్‌ కు చెందిన టులాస్‌ బాయ్‌ వంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి, దవడ గాయంతో క్వార్టర్స్ లో వెనుదిరిగాడు. గత కొంత కాలంగా బాక్సింగ్‌ పోటీలకు దూరంగా ఉంటున్న వీరిద్దరూ, విజేందర్ సింగ్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫినిటీ ఆప్టిమల్‌ సొల్యూషన్స్‌ (ఐఓఎస్‌)తో ఒప్పందం చేసుకున్నారు. రెండు నెలల్లో ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్ లో సత్తాచాటాలని భావిస్తున్న వీరిద్దరూ హర్యాణా పోలీసు శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే వీరి ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలను తిలకించవచ్చు.

More Telugu News