: పాకిస్థాన్ రేంజర్ల కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల బాలుడు
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. తరచూ కాల్పులకు తెగబడుతూ భారత సైన్యం సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా కనాచక్ సెక్టార్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురు అమాయక ప్రజలు గాయాలపాలయ్యారు. మోర్టార్లు ప్రయోగిస్తూ చెలరేగిపోతుండంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి ప్రయోగించిన మోర్టార్లకు అక్కడి ప్రాంతంలో 30 పశువులు మృతి చెందగా, మరో 100 పశువులు గాయాలపాలయ్యాయి. తమ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రజలు వేడుకుంటున్నారు.