: నేను తీసుకున్నది మీ సొంత డబ్బు కాదు: కపిల్ సిబల్ పై విరుచుకుపడ్డ రీటా బహుగుణ

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పై తాజా బీజేపీ మహిళా నేత రీటా బహుగుణ మండిపడ్డారు. తన నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదనే అర్థం వచ్చేలా కామెంట్ చేసిన సిబల్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ కు చెందిన రీటా బహుగుణ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో, ఆమెపై విమర్శలు గుప్పించిన కపిల్ సిబల్... ఆ వలస పక్షి తన డబ్బులతో ఎగిరిపోయింది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో రీటా మాట్లాడుతూ, సిబల్ వంటి సీనియర్ నేతలు ఇంత చవకబారు కామెంట్లు చేస్తారా? అని ప్రశ్నించారు. తాను తీసుకున్నది కపిల్ సిబల్ సొంత డబ్బు కాదని, తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన నియోజకవర్గం కోసం ఎంపీలాడ్ (ఎంపీ నిధులు) ఫండ్ తీసుకున్నానని చెప్పారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే కపిల్ సిబల్ కు, జిల్లా కలెక్టర్ లను తన ఖాతా రద్దు చేయాలని, ఎంపీ నిధులను వెనక్కి తీసుకోవాలని కోరానని తెలిపారు.

More Telugu News