: ఎంబ్రాయర్ స్కాంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు... ప్రధాన నిందితుడు విపిన్ ఖన్నా

సంచలనం సృష్టించిన ఎంబ్రాయర్ విమానాల కొనుగోలు స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ ను దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రవాస భారత రక్షణ రంగ కన్సల్టెంట్ విపిన్ ఖన్నా ప్రధాన నిందితుడని పేర్కొంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్ దేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఆయన ముడుపులు తీసుకున్నాడని, ఎంబ్రాయర్ అనుబంధ సంస్ధ నుంచి మూడు దఫాలుగా నగదు లావాదేవీలు జరిగాయని పేర్కొంది. సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ సంస్థగా లిస్టింగ్ అవుతున్న ఇంటర్ దేవ్ సంస్థ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మీదుగా నగదు తరలింపు చేపట్టిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. కాగా, ఈ డీల్ లో అవకతవకలు జరిగాయని తొలుత బ్రెజిల్ మీడియా వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎంబ్రాయర్ -145 రకానికి చెందిన మూడు విమానాలను రక్షణ శాఖ కొనుగోలు చేయగా, కోట్ల రూపాయల మేరకు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ డీల్ ను కుదుర్చుకుంది. రాడార్లు, కంట్రోలింగ్ వ్యవస్థలను కలిగున్న ఈ విమానాలు, యుద్ధం సమయాల్లో గస్తీ తిరుగుతూ, గాల్లోంచి దూసుకొచ్చే క్షిపణుల గురించిన సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తాయి.

More Telugu News