: ఆ సినిమాపై మాట్లాడి, ప్రమాదాలు కొనితెచ్చుకోలేను: అమీర్ ఖాన్ మేనల్లుడు

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ నిర్మించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయం భారత్, పాక్ దేశాల్లో ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. పాక్ నటులు నటించిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను ఆడనివ్వమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన డెడ్లీ వార్నింగ్ ఇవ్వడంతో... ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉరీ ఉగ్ర దాడుల నేపథ్యంలో, ఎమ్మెన్నెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, కరణ్ కు, పాక్ నటులకు అనుకూలంగా మాట్లాడిన బాలీవుడు ప్రముఖులు చాలా మందిపై విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, యువ హీరో అయిన ఇమ్రాన్ ఖాన్ ఈ సినిమా వివాదంపై మాట్లాడనని స్పష్టం చేశాడు. ఈ వివాదానికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించి, ప్రమాదాలను కొనితెచ్చుకోలేనని చెప్పాడు. ఈ వివాదంపై తనకు కూడా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని... అయితే, వాటిని వెల్లడిస్తే, కొంత మంది మా ఇంటిని కూడా తగలబెట్టే ప్రయత్నం చేస్తారని తెలిపాడు. దాడి చేస్తామనే హెచ్చరికలను తాను ఎదుర్కోదలచలేదని... అందుకే, తన అభిప్రాయాలను తనలోనే దాచుకుంటున్నానని చెప్పాడు.

More Telugu News