: ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?: కేంద్ర మంత్రి సుప్రియో

పలానా సినిమా చూడొద్దంటూ చెప్పే హక్కు మీకెవరిచ్చారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రశ్నించారు. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో మీరెలా చెబుతారని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరీలో ఉగ్రదాడి జరిగిన తర్వాతే పాక్ నటులను బాలీవుడ్ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ వచ్చిందని... ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ అంతకు ముందే తీసినవని ఆయన గుర్తు చేశారు. మరోవైపు, నిన్న బాబుల్ సుప్రియోపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ, దాడికి సంబంధించి తృణమూల్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ ప్రవర్తన చాలా దారుణంగా ఉందని విమర్శించారు.

More Telugu News