: అంతరాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఇరానీకి ఉద్వాసన పలికిన మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం పనిచేస్తున్న అంతరాష్ట్ర మండలి నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సదానంద గౌడలను తప్పించారు. వీరి స్థానంలో నూతనంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ను తీసుకున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదే సమయంలో స్టాండింగ్‌ కమిటీలో ఎలాంటి మార్పులు లేవని, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ కమిటీలో కొనసాగుతారని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే, వాటిని పరిష్కరించేందుకు 1990లో అంతరాష్ట్ర మండలి ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. దాదాపు పదేళ్ల తరువాత గడచిన జూలైలో అంతర్రాష్ట్ర మండలి 11వ సమావేశం జరిగింది. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, మనోహర్‌ పారికర్‌ లు సభ్యులుగా, మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు.

More Telugu News