: ఇక రంగంలోకి దిగనా?.. ములాయంను అనుమతి కోరిన అఖిలేష్

వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో తాను ప్రచారం ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ సీఎం అఖిలేష్, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారు. నవంబర్ 3 నుంచి ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న అఖిలేష్, రెండో దఫా సీఎం అభ్యర్థిగా తన పేరును ఖరారు చేస్తేనే, ప్రచారంలో దూసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా తన పేరు లేకుంటే ప్రచారంలో మైలేజ్ దక్కదన్నది అఖిలేష్ అభిప్రాయం. అయితే, ఎన్నికల తరువాత మాత్రమే తమ పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని గత వారంలో ములాయం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆపై ములాయం మాట మార్చి, తన కుమారుడే సీఎం పదవికి సరైన వ్యక్తని చెప్పినప్పటికీ, ప్రజల్లో, కార్యకర్తల్లో నెలకొన్న అయోమయం పూర్తిగా తొలగితేనే, తన ప్రచారం ఫలవంతమవుతుందని అఖిలేష్ భావిస్తున్నారు. అందువల్లే తాను రంగంలోకి దిగేముందు తండ్రి అనుమతి తీసుకోవాలని భావించి ఈ లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ములాయం సోదరుడు, రాష్ట్ర మంత్రి శివపాల్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలను అఖిలేష్ వ్యతిరేకించడంతో వారి కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

More Telugu News