: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ డెబిట్ కార్డులున్నాయా? చైనాలో వాడుతున్నారు... బీ కేర్ ఫుల్!

ఇండియాలో అతిపెద్ద ఆర్థిక సమాచార కుంభకోణం జరుగగా, చైనాలోని పలు ప్రాంతాల నుంచి తమ డెబిట్ కార్డులను వాడుతున్నట్టు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల బారిన పడ్డట్టు అధికారులు అనుమానిస్తుండగా, వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెందిన కార్డులే అత్యధికంగా ఉన్నాయని తెలుస్తోంది. వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాంపై వాడుతున్న 26 లక్షల కార్డులతో పాటు రూపే ప్లాట్ ఫాంపై వాడుతున్న 6 లక్షల కార్డుల వివరాలు అక్రమార్కులకు చేరినట్టు తెలుస్తోంది. ఏటీఎంలలోకి మల్ వేర్ ను ప్రవేశపెట్టిన హ్యాకర్లు, కార్డు నంబర్, పిన్ వివరాలు తెలుసుకుని డబ్బు నొక్కేస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ సేవల సంస్థ ఎస్ఐఎస్ఏ, బెంగళూరు కేంద్రంగా సాగిన చెల్లింపులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, తప్పుడు లావాదేవీల సమాచారాన్ని బయటపెట్టింది. మరోవైపు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం భారత సర్వర్లలోని లోపాలను కనుగొనే దిశగా విచారణకు ఆదేశించింది. బ్యాంకుల డెబిట్ కార్డు మోసాలపై ఇప్పటికే వందలాది ఫిర్యాదులు అందాయని వెల్లడించిన ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోతా, అనుమానాస్పద లావాదేవీలన్నీ చైనా నుంచి సాగాయని స్పష్టం చేశారు. లోపం ఎక్కడ ఉందన్న విషయాన్ని విచారణ తరువాతే నిగ్గు తేలుస్తామని తెలిపారు. హెచ్డీఎఫ్సీయేతర ఏటీఎం సెంటర్లలో పిన్ నంబర్లు మార్చుకున్న అన్ని కార్డుల వివరాలూ బయటకు పొక్కినట్టు అనుమానిస్తున్నామని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. కస్టమర్లంతా పిన్ నంబర్ మార్చుకోవాలంటే హెచ్డీఎఫ్సీ ఏటీఎంలను మాత్రమే వాడాలని సలహా ఇచ్చింది. కాగా, తమ ఏటీఎంలలో ఎలాంటి లోపాలూ లేవని, ఎస్బీఐ కార్డులుండి ఇతర నెట్ వర్క్ ఏటీఎంలు వాడిన వారి కార్డులన్నీ మారుస్తున్నట్టు బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఏటీఎం కార్డుల మోసాలపై వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ, యాక్సిస్, యస్ బ్యాంకులు స్పందించాల్సి వుంది.

More Telugu News