: అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ల్యాండర్ ఆచూకీ మిస్సయింది... చివరి సిగ్నల్ అందుకున్న భారత్

యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి అంతరిక్ష రంగంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. యూరోపియన్ మార్స్ మిషన్ ప్రాజెక్ట్ కింద అంగారకుడిపైకి పంపిన మార్స్ ల్యాండర్ షియాపరెల్లి ఆచూకీ మిస్సయింది. లెక్క ప్రకారం, బుధవారం ఈ మార్స్ ల్యాండర్ అంగారక గ్రహంపై దిగాల్సి ఉంది. అయితే, అంగారకుడిపై దిగే కొన్ని క్షణాల ముందు నుంచి ల్యాండర్ నుంచి రేడియో సంకేతాలు ఆగిపోయాయి. దీంతో గ్రౌండ్ కంట్రోల్ లో ఉత్కంఠ పెరిగిపోయింది. మరో విషయం ఏమిటంటే, మార్స్ ల్యాండర్ నుంచి చివరి సిగ్నల్ అందుకున్న దేశం ఇండియానే. 1.3 బిలియన్ డాలర్ల యూరోపియన్ మార్స్ మిషన్ లో భాగంగా షియాపరెల్లి ల్యాండర్ ను పంపించారు. ల్యాండర్ అంగారకుడిపై ల్యాండ్ అయిందని, ఐతే దిగే క్రమంలో ధ్వంసం అయి ఉండవచ్చని లేదా పనిచేయకుండా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు, 13 ఏళ్ల క్రితం అంగారకుడిపై రోవర్ ను దింపేందుకు యూరప్ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. అంగారకుడిపై జీవం ఉందా లేదా (ప్రస్తుతం లేదా గతంలో అయినా) కనుక్కునేందుకు షియాపరెల్లికి ఓ డ్రిల్ ను ఫిక్స్ చేశారు. ఇది ఉపరితలంపై రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి, మట్టిన తీసి, పరీక్షిస్తుంది. కనీసం ఏక కణ జీవులు అయినా అంగారకుడిపై ఉన్నాయా? అనే కోణంలో ఇది పరీక్షలు నిర్వహిస్తుంది. అంతేకాదు, అంగారకుడిపై మీథేన్, నైట్రోజన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ లను ఇది అధ్యయనం చేయాల్సి ఉంది.

More Telugu News