: అంతా వెళ్లిపోయారు, ఇక హైదరాబాద్ ను 'ఉమ్మడి' అనవద్దు: కేంద్రానికి కేసీఆర్ సర్కార్ లేఖ!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైందని, హైదరాబాద్ లోని ఉద్యోగులంతా అక్కడికి తరలి వెళ్లారని కేంద్రానికి తెలుపుతూ, హైదరాబాద్ నగరాన్ని ఇక ఉమ్మడి రాజధానిగా పరిగణించవద్దని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా చూపించాల్సిన అవసరం లేదని, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ ను రాజధానిగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం. ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. కాగా, చట్టంలోనే 'ఉమ్మడి రాజధాని' అన్న పదాన్ని పేర్కొన్నందున, కేవలం హోం శాఖ నిర్ణయం మాత్రమే సరిపోదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణ చేయాల్సి వుందని, దానికి రెండు రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరని, ఏపీ ప్రభుత్వం అంగీకరించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికీ పాలనలో భాగమైన న్యాయ సంబంధ వ్యవహారాలు, వాటిని చూసుకునే ఉద్యోగులు హైదరాబాద్ లోనే ఉన్నారని, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పూర్తి కాకుండా హైదరాబాద్ ను తెలంగాణకే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలకూ ఒకే హైకోర్టు ఉందన్న విషయాన్ని అధికార వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

More Telugu News