: పాకిస్థాన్ సరికొత్త కుట్ర పేరు 'ఆపరేషన్ క్లీన్ హార్ట్'... హై అలర్ట్!

భారత్ పై భారీ కుట్రకు పాక్ సర్వం సిద్ధం చేసింది. సరిహద్దుల్లో భారత బలగాలు పాక్ ఆటలు సాగనివ్వకపోవడంతో మరో దారిలో భారత్ పై కుట్రకు రంగం సిద్ధం చేసింది. వివరాల్లోకి వెళ్తే...సర్జికల్ స్ట్రైక్స్‌ తరువాత భారత్ పై ఎలాగైనా కసితీర్చుకోవాలన్న కృతనిశ్చయంతో పాకిస్థాన్ ఉంది. దీంతో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ క్లీన్ హార్ట్’ పేరుతో ఉగ్రదాడులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది బంగ్లాదేశ్‌ లో శిక్షణ పొందిన ‘జమాతే ఈ ఇస్లామీ’ సంస్థకు చెందిన 12 మంది ఉగ్రవాదులకు భారత్ పై దాడులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది. వీరందరూ తుపాకులు వాడడం, సైన్యాన్ని ఎదుర్కోవడంలో శిక్షణ పొందిన వారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలలో ఉగ్రదాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని, ఈ నగరాల్లో జనసమ్మర్థం అధికంగా గల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ 12 మందికి సంబంధించిన సమాచారాన్ని రా (రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), ఐబీ, రక్షణశాఖ ఇంటెలిజెన్సీ, నావికాదళాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నాయి. దాడులకంటే ముందుగానే వారిని పట్టేసేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి.

More Telugu News