: రెండో కోడలి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్న యువరాజ్ సింగ్ తల్లి

యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్ తన రెండో కొడుకు భార్య చేసిన ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నారు. వివాదం ఇంకా కోర్టులో ఉన్నందున దీనిపై తానేమీ మాట్లాడనని, అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కోడలు ఇప్పుడు మాట్లాడడం వెనుక కారణం బిగ్ బాస్ లాంటి వేదిక దొరకడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలు అప్పుడే చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు. వైవాహికబంధం విచ్ఛిన్నమైనప్పుడు ఎవరో ఒకరు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అది తానే అని నిందించినా ఫర్వాలేదని, ఆమెకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. కాగా, బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైన సందర్భంగా యువరాజ్ సింగ్ తమ్ముడు జొరావర్ సింగ్ ను వివాహం చేసుకున్న గుర్గావ్ కు చెందిన ఆకాంక్ష శర్మ (25) పెళ్లయిన 4 నెలలు అంతా బాగుందని చెప్పింది. ఆ తరువాత నరకం చూశానని తెలిపింది. తన అత్తగారి వల్లే తన వివాహ బంధం విచ్ఛిన్నమైందని వెల్లడించింది. దాని నుంచి కోలుకునేందుకు ఈ షోకు వచ్చానని ఆమె తెలిపింది. తన అత్తగారి కుటుంబం నుంచి తాను ఏదీ కోరుకోవడం లేదని, తనకు విడాకులు ఇస్తే చాలని ఆమె వ్యాఖ్యానించింది.

More Telugu News