: నా భవిష్యత్‌ గురించి సల్మాన్‌ ఖాన్ ఆనాడే చెప్పాడు.. నిజమైంది: ‘అఖిల్’ సినిమా హీరోయిన్ సాయేషా సైగల్‌

కొత్త నటీమణుల టాలెంట్‌ను గుర్తించ‌డంలో, బాలీవుడ్‌కి వారిని ప‌రిచ‌యం చేయ‌డంలో ముందుండే స‌ల్మాన్ ఖాన్ త‌న భ‌విష్య‌త్తును గురించి ముందుగానే ఊహించి చెప్పాడంటోంది 'అఖిల్' సినిమా హీరోయిన్ సాయేషా సైగల్‌. ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ‘శివాయ్‌’ చిత్రంలో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్‌ను అద్భుతమైన వ్యక్తిగా అభివ‌ర్ణించింది. ఆయ‌న‌కు తాను అభిమానినని చెప్పింది. గ‌తంలో త‌న‌ తాతయ్య దిలీప్‌కుమార్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా తాను సల్మాన్‌ను కలిసిన‌ట్లు సాయేషా సైగల్‌ పేర్కొంది. ఆ స‌మ‌యంలోనే తాను భవిష్యత్‌లో సినిమాల్లోకి వస్తానని స‌ల్మాన్ ఖాన్ చెప్పార‌ని ఆమె గుర్తు చేసుకుంది. టాలెంట్ ఎక్క‌డ ఉన్నా స‌ల్మాన్ ఇట్టే గుర్తిస్తాడ‌ని తాను అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించింది. స‌ల్మాన్ చెప్పినట్టుగానే త‌న‌కు సినీరంగంలో అవకాశాలు వచ్చిన‌ట్లు పేర్కొంది. తన‌కు ‘శివాయ్‌’ మూవీలో న‌టించేందుకు ఆఫర్‌ వచ్చినపుడు అందులో నటించాలా? వద్దా? అనే అంశంపై తాను సల్మాన్ ఖాన్‌ని సలహా అడిగిన‌ట్లు చెప్పింది. స‌ల్మాన్ ఓకే అని చెప్పాకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో తాను నటించడం ఓ అదృష్టమ‌ని చెప్పింది. త‌న‌కు స‌ల్మాన్‌తో క‌లిసి ప‌నిచేయాలని ఉంద‌ని పేర్కొంది.

More Telugu News