: త్వరలో ఏపీ కేబినెట్‌లో మార్పులు.. లోకేశ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ?

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ చాలాకాలంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. దీపావళి పండుగకు ముందుకానీ, ఆ తర్వాత కానీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు విస్తరణకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారని సమాచారం. ప్రస్తుత కేబినెట్‌లో కొందరికి ఉద్వాసన పలకడంతోపాటు మరికొందరి శాఖల్లో మార్పులు, చేర్పులు చేయాలని సీఎం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను నిర్వహిస్తున్న కె.మృణాళినిని తప్పించి ఆ స్థానంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కేబినెట్‌లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అలాగే లోకేశ్‌కు కీలకమైన పరిశ్రమల శాఖతోపాటు ఐటీ శాఖను కేటాయించే అవకాశం ఉంది. కేబినెట్‌లో మార్పుచేర్పుల అనంతరం చంద్రబాబు వచ్చేనెల 12న అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం.

More Telugu News