: ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి తీవ్రవాదుల ముప్పు... 'వై కేటగిరీ' భద్రత కల్పించిన కేంద్రం

ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ వార్తా విశ్లేషకుడు ఆర్నబ్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలో, ఆర్నబ్ కు 24 గంటలూ 20 మంది భద్రతాసిబ్బంది రక్షణ కల్పిస్తారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదుల నుంచి ఆర్నబ్ కు ముప్పు ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో, ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ వివరాలను హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. హిందుస్థాన్ టైమ్స్ కు చెందిన టైమ్స్ నౌ ఛానల్ లో పాక్ ఉవ్రవాదులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో, ఆర్నబ్ ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని... ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఆయనకు భద్రత కల్పించామని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఉరీ దాడుల తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా 'న్యూస్ డిబేట్' కార్యక్రమంలో ఆర్నబ్ తన గళం వినిపించారు. ఆర్నబ్ తో పాటు 'సమాచార్ ప్లస్'కు చెందిన అశ్విని కుమార్ చోప్రాకు జడ్ ప్లస్ కేటగిరీ, ఇదే సంస్థకు చెందిన ఉమేష్ కుమార్ కు వై కేటగిరీ, జీ న్యూస్ కు చెందిన సుధీన్ చౌధరీకి ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించారు.

More Telugu News