: ఎలుకల దాడితో చిన్నారి మృతి

ఎలుకలు కొరకడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారి దుర్మరణం పాలైన సంగతి మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన ఘటన తాజాగా జమ్ముకశ్మీర్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, జమ్ములోని మారుమూల ప్రాంతమైన చత్రూకి చెందిన గులామ్ హుస్సేన్ భార్యకు పురిటి నొప్పులు రావడంతో... ఆమెను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. గురువారంనాడు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం, వైద్య చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని మెటర్నిటీ వార్డుకు తరలించారు ఆసుపత్రి సిబ్బంది. శనివారం బిడ్డను చూద్దామని వెళ్లిన గులామ్ కు తీవ్రంగా గాయపడిన బాబు కనిపించాడు. ఎలుకల దాడిలో బాబు శరీరమంతా తీవ్ర రక్తస్రావమై ఉంది. వెంటనే, డ్యూటీలో ఉన్న డాక్టర్లకు ఆయన సమాచారమిచ్చాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు... అప్పటికే బాబు మరణించాడని తెలిపారు. ఈ సందర్భంగా జమ్ము హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ గుర్జిత్ సింగ్ మాట్లాడుతూ, గులామ్ వెళ్లే సమయానికి కూడా బాబును ఎలుకలు కొరుకుతూ కనిపించాయని తెలిపారు. ఈ దారుణ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ఘటనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News