: ట్రంప్ పార్టీ కార్యాలయంపై బాంబు దాడి... అమెరికాలో కలకలం

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కరోలినా ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయం కిటికీ గుండా లోపలకు బాంబులు విసిరారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నిచర్ తో పాటు, ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా కాలిబూడిదైందని వెల్లడించారు. అంతేకాదు, ఘటనా స్థలికి సమీపంలో, మూసి ఉన్న ఓ షట్టర్ పై 'నాజీ రిపబ్లికన్ లారా ఇక్కడ నుంచి వెళ్లిపోండి... లేకపోతే...' అంటూ రాసిన రాతలు కనిపించాయని తెలిపారు. మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరగడం అమెరికాలో కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన రిపబ్లికన్ పార్టీ... జరిగిన దాడిని 'రాజకీయ ఉగ్రవాదంగా' అభివర్ణించింది. కరోలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని పేర్కొంది. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందనే అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని... ఈ ఘటనను తాము ఎన్నటికీ మరిచిపోమని తెలిపింది.

More Telugu News