: సినీ నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పాక్ నటులపై నిషేధాన్ని కడిగేసిన ప్రియాంకా చోప్రా

పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక మాట్లాడుతూ, 'యూరీ సెక్టార్ పై దాడి జరిగితే పాక్ నటులు ఏం చేశారు?' అని నిలదీసింది. ఎవరో చేసిన పనికి పాక్ నటులను శిక్షించడం ఎందుకు? అని అడిగింది. ఈ విధానం సరికాదని, ఇది తప్పు అని స్పష్టం చేసింది. తనకు దేశ భక్తి ఉందని చెప్పిన ప్రియాంకా చోప్రా, భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపింది. అయితే ఒక్క పాకిస్థాన్ నటులపైనే నిషేధం ఎందుకు? అని ప్రశ్నించింది. 'సినీ నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పాక్ నటులే మీకు కనపడ్డారా? పాక్ వైద్యులు, బిజినెస్‌ మెన్‌, రాజకీయ నాయకులను ఎందుకు వేలెత్తి చూపడం లేదు?' అని నిదీసింది. కేవలం యూరీ ఘటనే కాదని, దేశంలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొదట నటులు, కళాకారులనే లక్ష్యం చేసుకుంటున్నారని మండిపడింది. ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగిన ప్రియాంకా చోప్రా...గాంధీజీ నడిచిన మన దేశంలో అహింసకు కట్టుబడి ఉన్నామని నీతి సూత్రాలు వల్లె వేసింది. చేయాల్సిన పనులను మర్చిపోయి, అనవసరమైన వాటిపైనే ఎక్కువగా శ్రద్ధపెడుతున్నారని, వాటి గురించే చర్చిస్తుంటారని ప్రియాంకా చోప్రా తెలిపింది.

More Telugu News