: ఇంకో 20 ఏళ్లు టీడీపీ నే అధికారంలో ఉండాలి... ప్రతిపక్షం లేకుండా చూడాలని నేతలకు చంద్రబాబు ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ లో మరో 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉండాలన్న అభిమతాన్ని చంద్రబాబునాయుడు తన అనుయాయుల వద్ద స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విపక్షం అన్న మాట వినపడకుండా చూడాలని కూడా ఆయన టీడీపీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఓ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు, "ఈ రాష్ట్రంలో విపక్షాలకు స్థానం ఉండకూడదు. విపక్షాలు లేకుండా ఉంటేనే మనం మన లక్ష్యాలను సాధించగలుగుతాం" అని ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చెప్పారు. ఆపై "రాష్ట్రానికి ప్రయోజనం కలగాలంటే, వచ్చే 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. 2019లో ఎన్నికలు జరిగేలోగా, ప్రతి జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కుదురుకుపోవాలి. అంతకన్నా ముందే జరిగే ఎంఎల్సీ ఎలక్షన్లలో గెలవాలి" అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని, పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో విజయం సాధించి తీరాలని ఆయన చెప్పారు. పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేయాలని కింది స్థాయి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన చంద్రబాబు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఆ ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

More Telugu News