: సాధ్వి ప్రగ్యా సింగ్‌కు బెయిల్ ఎందుకు నిరాక‌రిస్తున్నారు? : ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన బాంబే హైకోర్టు

మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కి ప్రత్యేక కోర్టు బెయిలు నిరాక‌రించ‌డం ప‌ట్ల బాంబే హైకోర్టు ఈరోజు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అమె బెయిలు దరఖాస్తు ఈరోజు హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం స్పందిస్తూ దర్యాప్తు సంస్థ ఆరోపణలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కి బెయిలు ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించింది. ఆమెను ఏ విధంగా జైలులో ఉంచాలని అడిగింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు అభ్యంతరాలు కూడా లేవ‌ని పేర్కొంది. ఈ కేసులో త‌దుప‌రి విచారణ వచ్చే నెల 16న జరుగుతుందని పేర్కొంది. మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించిన అన్ని తీర్పులను త‌మ ముందు ఉంచాల‌ని హైకోర్టు ఎన్ఐఏను కోరింది. ఈ కేసుపై ఆరా తీసిన‌ జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) ఇటీవ‌లే సాధ్వి ప్రగ్యాను దోషిగా నిరూపించదగిన ఆధారాలేవీ లేవని పేర్కొంది. దీంతో ఆమె బెయిలు కోసం ప్రత్యేక కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ న్యాయ‌స్థానం అందుకు నిరాక‌రించ‌డంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

More Telugu News