: కెప్టెన్సీ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి బాగా తెలుసు!: మాజీ సెలెక్టర్ ప్రశ్న
టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ స్థానం సాధించడం ద్వారా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కూడా కోహ్లీకి అప్పగించాలని పలువురు వెటరన్ లు బీసీసీఐకి, ధోనీకి సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2004లో ధోనీ బంగ్లాదేశ్ టూర్ కి ఎంపికయ్యేందుకు కారణమైన మాజీ సెలక్టర్ ప్రణబ్ రాయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కోహ్లీ టెస్టు కెప్టెన్ గా విజయవంతమయ్యాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే కోహ్లీ విజయవంతం కావడానికి, ధోనీ కెప్టెన్సీ అప్పగించడానికి సంబంధం లేదని అన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ధోనీ విజయవంతమైన కెప్టెన్ గా ఇప్పటికే నిరూపించుకున్నాడని ఆయన గుర్తు చేశారు. కెప్టెన్సీ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి బాగా తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాడిగా, కెప్టెన్ గా విజయవంతమైన ధోనీకి బాధ్యతలను ఎప్పుడు కోహ్లీకి అప్పగించాలో బాగా తెలుసని ఆయన పేర్కొన్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన తెలిపాడు. అయితే ధోనీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని ఆయన చెప్పాడు. సెలెక్టర్ గా ధోనీని ఎంపిక చేయడం తన నిర్ణయాల్లో అత్యుత్తమమైనదిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నాడు.