: విశ్లేషకుల అంచనాలను పటాపంచలు చేసిన ఇన్ఫోసిస్ క్యూ-2 ఫలితాలు... 6 శాతం పెరిగిన నికర లాభం

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభాలు భారీగా తగ్గుతాయన్న విశ్లేషకుల అంచనాలు పటాపంచలు అయ్యాయి. మార్కెట్ నిపుణుల అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను ఐటీ దిగ్గజం సాధించింది. జూలై- సెప్టెంబర్ మధ్య కాలంలో సంస్థ నికర లాభం 2015-16 క్యూ-2తో పోలిస్తే, 6.1 శాతం పెరిగి రూ. 3,606 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 18,070 కోట్లకు చేరింది. నిర్వహణా లాభం ఏకంగా 0.8 శాతం వృద్ధితో 4.9 శాతానికి మెరుగుపడింది. ఈ ఫలితాలు తమకు అత్యంత సంతృప్తిని కలిగించాయని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ అంచనాలను స్వల్పంగా తగ్గిస్తున్నామని తెలిపారు. ఫలితాలు బాగుండటంతో ఒక్కో ఈక్విటీ వాటాపై రూ. 11 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించాలని ఇన్ఫీ నిర్ణయించింది. ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ ను ఆశ్చర్యంలోకి ముంచెత్తగా వాటా విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. నేటి సెషన్ ఆరంభంలో ఈక్విటీ విలువ 3 శాతం లాభపడింది. ఆపై ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగడంతో 5 శాతం మేరకు నష్టపోయింది. తిరిగి కొనుగోలు మద్దతు రావడంతో మధ్యాహ్నం 12:25 గంటల సమయానికి 1.18 శాతం నష్టంతో రూ. 1039 వద్ద కొనసాగుతోంది.

More Telugu News