: పాక్ ఐఎస్ఐకి భారత సైన్యం రహస్యాలు చెప్పిన సైనికాధికారి... హోం శాఖ నిఘాతో అడ్డంగా బుక్కయిన వైనం

జమ్మూ కాశ్మీర్ లోయలో భారత్ మోహరించిన సైన్యం గురించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో పంచుకున్నాడో సైన్యాధికారి. తన్వీర్ అహ్మద్ అనే డీఎస్పీ స్థాయి అధికారి పాక్ అధికారితో మాట్లాడుతున్న టెలిఫోన్ సంభాషణలను కేంద్ర హోం శాఖ గుర్తించడంతో, జమ్మూ కాశ్మీర్ డీజీపీ కె.రాజేంద్ర కుమార్ స్పందించారు. తన్వీర్ అహ్మద్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి, విచారణకు ఆదేశించారు. కాగా, తానేమీ తప్పుడు పని చేయలేదని అంటున్నారు తన్వీర్. ఓ వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, తాను భారత ఆర్మీ అధికారినని చెప్పుకుని, లోయలో భద్రతా దళాల మోహరింపు గురించిన సమాచారాన్ని అడిగాడని తెలిపారు. తాను ఏ రహస్యాన్నీ చెప్పలేదని అంటున్నారు. ఈ మొత్తం ఉదంతంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరోవైపు బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ జరిగి మూడు నెలలు దాటినా, పరిస్థితి సద్దుమణగలేదు. 97 రోజుల నుంచి ఏదో ఒక ప్రాంతంలో భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ 91 మంది చనిపోగా, 12 వేల మందికి పైగా గాయపడ్డారు.

More Telugu News