: ‘చేతక్’, ‘చీతా’ల స్థానంలో అత్యాధునిక హెలికాప్టర్లు.. రష్యాతో భారత్ ఒప్పందం

భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. వైమానిక దళం వినియోగిస్తున్న చేతక్, చీతా హెలికాప్టర్ల స్థానంలో అత్యాధునిక హెలికాప్టర్లు రంగప్రవేశం చేయనున్నాయి. ఈ మేరకు గురువారం రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. రూ.1200 కోట్ల డీల్‌పై భారత్-రష్యాలు సంతకం చేశాయి. ప్రధాని మోదీ గతేడాది డిసెంబరులో రష్యాలో పర్యటించినప్పుడే ఈ ఒప్పందంపై అవగాహన కుదరగా, చర్చల అనంతరం 200 ‘కామొవ్ 226టి’ చాపర్ల కొనుగోలుకు తాజాగా ఒప్పందం కుదిరింది. హెలికాప్టర్లను సరఫరా చేసిన అనంతరం సర్వీస్ కోసం భారత్‌లో ప్రత్యేకంగా ఓ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ సీఈవో సెర్జాయ్ కెమెజోవ్ తెలిపారు. అలాగే అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థ సరఫరాకు సంబంధించిన ఒప్పందంపై శనివారం ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎస్-400 ‘ట్రింఫ్’ క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థను రష్యా సరఫరా చేస్తుంది. దేశంలో సమగ్ర మౌలిక వసతులతో కూడిన 25 వికరణీకరణ (ఇర్రేడియేషన్) కేంద్రాల ఏర్పాటుపైనా ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.

More Telugu News