: ఉగ్రవాదులకు ఆర్మీ ఎందుకు సాయం చేస్తోంది?: పాక్ ను నిలదీసిన యువతి... వీడియో వైరల్

ఆర్మీకి, ఉగ్రవాదులకు సంబంధం ఏంటి? అంటూ ఓ యువతి పాక్ ఆర్మీని కడిగేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారత్‌ లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ సాయం ఉందనేది జగద్విదితం. అసలు భారత్ లోకి ఉగ్రవాదులను పంపేది పాక్ ఆర్మీనే అనే ఒక వాదన ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏడాది క్రితం పాకిస్థాన్ లో టీవీ ఛానెల్ డిబేట్ నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ యువతి ఉగ్రవాదులు, మిలటరీ మధ్య వున్న సంబంధాలపై కడిగిపడేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై ఆ యువతి మాట్లాడుతూ, అసలు పాక్ మిలటరీకి, ఉగ్రవాదులకు సంబంధం ఏంటని ప్రశ్నించింది. చరిత్రను తవ్వితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. శత్రుత్వం పేరుతో, రాజకీయ ప్రయోజనాల పేరుతో ఎంత కాలం ఇలాంటి తప్పులు చేస్తుంటారని ప్రశ్నించింది. అమెరికా, భారత్, సమాజం, అవినీతి రాజకీయాలు ఇలా ఎన్ని మాట్లాడినా, జియావుల్ హక్ జనరల్ గా ఉన్న నాటి నుంచి ఉగ్రవాదులతో ఉన్న లింకులపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది. దేశంలోని ఏ రంగమూ పవిత్రంగా లేదని ఆమె మండిపడింది. వీటి గురించి నిర్లజ్జగా, వాస్తవాలు వాస్తవంగా మాట్లాడాలని ఆమె సూచించింది. వాస్తవానికి దేశంలో మిలటరీ పాత్ర ఎంత? ఎంతవరకు ఉండాలి? అన్నది తెలియజేయాలని సూచించింది. దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణమేంటని ప్రశ్నించింది. ఇందులో ప్రభుత్వ తీరును ఎండగట్టింది. అవినీతి రాజకీయ నాయకులపైనా దుమ్మెత్తి పోసింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆమెను చూసి అక్కడున్నవారు కన్నార్పడం కూడా మర్చిపోవడం విశేషం. మీరు కూడా ఆ వీడియో చూడండి.

More Telugu News