: బుల్లెట్ తగిలి నేవీ అధికారి మృతి.. ఆత్మహత్యగా అనుమానం

విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లోని ఐఎన్ఎస్ కుతార్ యుద్ధనౌకలో తుపాకి మిస్‌ఫైర్ కావడంతో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. హరియాణాకు చెందిన తేజ్‌వీర్ సింగ్(25) తూర్పు నౌకాదళంలో సబ్ లెఫ్టినెంట్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన పనిచేసే యుద్ధనౌక ఇంజిన్ రూము నుంచి ఒక్కసారిగా తుపాకి పేలిన శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న తోటి ఉద్యోగులకు రక్తపు మడుగులో పడి ఉన్న తేజ్‌వీర్ కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. తేజ్‌వీర్ కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై నేవీ అధికారులు విచారణ జరుపుతున్నారు. తేజ్‌వీర్ ఓ అనాథ. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో ఉండి చదువుకుని నేవీలో ఉద్యోగం సాధించారు. కాగా ఐఎన్ఎస్ సింధు ఘోష్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఓ సెయిలర్ మృతి చెందారు. నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News